విడుదలకు ముందు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ వంటి ప్రముఖుల ప్రశంసలు దండిగా పొందిన “జయమ్ము నిశ్చయమ్మురా” ప్రేక్షకుల ఆదరాభిమానాలను సైతం పుష్కలంగా పొందుతూ.. అసాధారణ విజయం సాధించే దిశగా పరుగులు తీస్తోంది.
కరీంనగర్ కుర్రాడు ఉద్యోగం నిమిత్తం కాకినాడ వెళ్లి.. అక్కడ ఓ అమ్మాయి ప్రేమలో పడి.. ఆ ప్రేమను సాధించుకోవడం కోసం ఎన్ని అగచాట్లు పడ్డాడు? ఆ తర్వాత ఎవరితో ఎలా ఆడుకున్నాడు? అనే కథాశంతో ఆద్యంతం అత్యంత వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం సాధిస్తున్న దేశవాళీ విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి “కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్ ప్లాన్ చేసింది చిత్ర బృందం.
డిసెంబర్ 2 (శుక్రవారం) ఉదయం ఆటలో కరీంనగర్ ప్రేక్షకుల్ని పలకరించి.. వరంగల్ లో మద్యాహ్నం, ఖమ్మంలో ఫస్ట్ షో మరియి సెకండ్ షోల్లో “జయమ్ము నిశ్చయమ్మురా” టీమ్ సందడి చేయనుంది.
డిసెంబర్ 3 (శనివారం) ఉదయం ఆటకి విజయవాడ, మధ్యాహ్నం ఆటలో ఏలూరు, సాయంత్రం ఆటకు రాజమండ్రి, సెకండ్ షోకు కాకినాడలోని ధియేటర్స్ లో చిత్ర బృందం సందడి చేయనుంది.
ఈ విజయయాత్రలో హీరోహీరోయిన్స్ శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ, దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరిలతోపాటు ఈ చిత్రంలో నటించిన కృష్ణ భగవాన్, రవివర్మ, ప్రవీణ్, జోగి బ్రదర్స్, మీనా తదితర నటీనటులు పాలుపంచుకోనున్నారని చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు ఓ ప్రకటనలో తెలిపారు.
“సమైక్యంగా నవ్వుకుందాం” అనే ట్యాగ్ లైన్ తో.. “దేశవాళీ వినోదం” అనే సరికొత్త నినాదంతో నవంబర్ 25న విడుదలైన “జయమ్ము నిశ్చయమ్మురా” మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న విషయం తెలిసిందే !
Cine Chitram Telugu Cinema World
