‘భూ’, ‘సశేషం’ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీకిషోర్. రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపే ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం ‘దేవిశ్రీప్రసాద్’ అనే మరో కొత్త ప్రయోగాత్మతక చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకిషోర్తో ఇంటర్వ్యూ…
నేపథ్యం….?
– ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను. సినిమాలపై ప్యాషన్తో ఫిలిం ఎడిటింగ్ నేర్చుకున్నాను. తర్వాత కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. కొన్ని షార్ట్ ఫిలింస్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్కు సెలక్ట్ అయ్యాయి. చిన్నప్పటి నుండి డ్యాన్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు హాంగ్కాంగ్లో జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూనే భూ, సశేషం అనే సినిమాలను డైరెక్ట్ చేశాను.
సినిమా రంగంపై ఆసక్తి ఎలా కలిగింది?
– బళ్ళారిలో చదువుతున్నప్పుడు రామ్గోపాల్వర్మ ‘సత్య’ సినిమా చూసి డైరెక్టర్ కావాలనుకున్నాను. అయితే ఎవరి సహకారం లేకపోవడంతో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కొంతకాలం వర్క్ చేశాను. తర్వాత డిఫరెంట్గా సినిమాలు చేయాలని ఆలోచించి భూ, సశేషం సినిమాలను డైరెక్ట్ చేశాను. భూ సినిమా కమర్షియల్గా ఆడకపోయినా డైరెక్టర్గా నాకు మంచి పేరుని తెచ్చి పెట్టింది.
‘దేవిశ్రీప్రసాద్’ అనే టైటిల్ పెట్టడానికి గల కారణాలేంటి?
– కథానుగుణంగానే టైటిల్ను పెట్టాం. ఫస్ట్లుక్ అనౌన్స్ చేయగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పర్టికులర్గా ఈ టైటిల్నే పెట్టడానికి కారణమైతే సినిమా చూస్తేగానీ తెలియదు.
సినిమాలో నటీనటులు గురించి చెప్పండి?
– స్వామిరారా, పిజ్జా సినిమాల్లో నటించిన పూజా రామచంద్రన్ కీలక పాత్రలో నటించింది. అలాగే పోసాని కృష్ణమురళిగారు ఓ చాలెంజింగ్ రోల్ చేశారు. వీరితో పాటు ఇద్దరు ప్రముఖ హీరోలు, ఒక ప్రముఖ కమెడియన్ కూడా నటించారు.
మీ గత చిత్రాలకు మీరే నిర్మాత కదా..’దేవిశ్రీప్రసాద్’ చిత్రాన్ని కూడా మీరే నిర్మిస్తున్నారా?
– లేదండీ..’దేవిశ్రీప్రసాద్’ సినిమాకు నేను డైరెక్టర్ను మాత్రమే. అక్రోష్, ఆర్.వి.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతల సహకారంతో సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేశాం. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
‘దేవిశ్రీప్రసాద్’ ఏ జోనర్ మూవీ..?
‘దేవిశ్రీప్రసాద్’ చిత్రం దర్శకుడిగా నా మూడవ సినిమా. క్రైమ్ సస్పెన్స్తో కూడుకున్న సబ్జెక్ట్ ఇది. చాల కొత్త కథ, ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ సినిమా చేస్తున్నాం. ఈ సినిమాలో క్యారెక్టర్స్ జనరల్ ఆడియెన్స్ ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. ప్రతివాడిలో మంచి, చెడు అనే రెండు అంశాలుంటాయి. వాటిని మనం ఎంత బ్యాలెన్స్డ్గా పెట్టుకున్నామనేదే ముఖ్యం. దేవిశ్రీప్రసాద్ చిత్రంలో క్యారెక్టర్స్ గుడ్, బ్యాడ్, అగ్లీ అనే మూడు క్యారెక్టర్స్పై బేస్ అయ్యి ఉంటాయి. నేను గతంలో చేసిన రెండు చిత్రాలకన్నా ఈ సినిమా బావుంటుందని కాన్ఫిడెంట్గా చెప్పగలను. అవుటండ్ అవుట్ సస్పెన్స్ మూవీకి కమర్షియల్ ఎలిమెంట్స్ను యాడ్ చేసి సినిమాను రూపొందించాం.
నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి?
– క్రైమ్ కామెడి, ట్రయాంగిల్ లవ్స్టోరీ, కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఓ లవ్స్టోరీ తరహా సినిమాలు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. అయితే ఏదీ చేసినా కొత్తగా ఉండాలనుకుంటాను. రెగ్యులర్గా ఉండకూడదని భావిస్తాను.